జీఎస్టీ 2.0... ప్రజలకు ఇది పండుగ బోనస్: సీఎం చంద్రబాబు

  • జీఎస్టీ 2.0 సంస్కరణలపై దేశంలోనే తొలి తీర్మానం చేసిన ఏపీ శాసనసభ
  • సంస్కరణలు దేశానికి గేమ్ ఛేంజర్ అని అభివర్ణించిన సీఎం చంద్రబాబు
  • ప్రజలకు ముందుగానే వచ్చిన దసరా, దీపావళి బోనస్ అని వ్యాఖ్య
  • 99 శాతం వస్తువులు 5 శాతం పన్ను శ్లాబులోకి వస్తాయని వెల్లడి
  • నిర్మాణ రంగం, వ్యవసాయం, ఆరోగ్య బీమా రంగాలకు భారీ ఊరట
  • సంస్కరణల ప్రయోజనాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారానికి ప్రభుత్వం యోచన
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన సంస్కరణలను స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ గురువారం కీలక తీర్మానం చేసింది. ‘జీఎస్టీ 2.0’ సంస్కరణలకు మద్దతుగా తీర్మానం చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ‘గేమ్ ఛేంజర్’గా నిలుస్తాయని అభివర్ణించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు దసరా, దీపావళి పండుగలను ముందుగానే తీసుకువచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... గతంలో దేశంలో పన్నుల వ్యవస్థ అత్యంత సంక్లిష్టంగా ఉండేదని గుర్తుచేశారు. సీఎస్టీ, వ్యాట్ వంటి 17 రకాల పన్నులు, 13 రకాల సెస్సులు, సర్ ఛార్జీలతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడేవారని అన్నారు. 'ఒక దేశం - ఒకే పన్ను' అనే నినాదంతో ప్రధాని మోదీ తెచ్చిన జీఎస్టీ, ఇప్పుడు రెండు శ్లాబులతో మరింత సరళతరంగా మారిందని ప్రశంసించారు. ప్రభుత్వానికి ఆదాయం పెరిగితేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయగలమని, సంపద సృష్టించని వారికి సంక్షేమం చేసే అధికారం లేదని స్పష్టం చేశారు.

నూతన సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యమంత్రి సభకు వివరంగా తెలిపారు. దాదాపు 99 శాతం వస్తువులు 5 శాతం పన్ను పరిధిలోకి రావడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలపై భారం గణనీయంగా తగ్గుతుందని అన్నారు. సబ్బులు, టూత్‌పేస్టులు, షాంపూలు, నెయ్యి వంటి నిత్యావసరాలు చౌకగా లభిస్తాయని చెప్పారు. అదేవిధంగా ఏసీలు, ఫ్రిజ్‌ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా తగ్గుముఖం పడతాయని తెలిపారు. నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, స్టీల్ వంటి వస్తువులు 5 శాతం శ్లాబులోకి రావడం వల్ల ఇళ్ల నిర్మాణం పుంజుకుంటుందని, సామాన్యుడి సొంతింటి కల నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని సున్నా శాతానికి తగ్గించడం చారిత్రాత్మకమని చంద్రబాబు అన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ఏపీకి ఏటా రూ.750 కోట్ల వరకు ఆదా అవుతుందని వివరించారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే అగ్రిటెక్ యంత్రాలపై పన్ను తగ్గించడం రైతులకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సంస్కరణల ఫలితంగా దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1.51 కోట్లకు, జీఎస్టీ వసూళ్లు రూ.22 లక్షల కోట్లకు పెరిగాయని గుర్తుచేశారు. ఈ ప్రయోజనాలు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ, చిట్టచివరి వ్యక్తికీ చేరేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Chandrababu Naidu
GST 2.0
Andhra Pradesh
AP Assembly
Tax Reforms
Indian Economy
Narendra Modi
GST collections
Universal Health Policy
Tax payers

More Telugu News